విపక్ష కూటమి కీలక బాధ్యతలు సోనియాకేనా? ఫ్రంట్ పేరుపై ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం

వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా విపక్షాలకు చెందిన 26 పార్టీలు బెంగళూరులో సమావేశమైన సంగతి తెలిసిందే. నిన్న ప్రారంభమైన ఈ సమావేశాలు ఈరోజు కూడా కొనసాగనున్నాయి. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కూటమికి చెందిన అగ్రనేతలు భేటీ కానున్నారు. 

నిన్న సాయంత్రం విపక్షాలకు చెందిన అగ్ర నేతలంతా విందు సమావేశంలో పాల్గొన్నారు. ఈ నాటి సమావేశానికి చెందిన అజెండాపై చర్చలు జరిపారు. మరోవైపు విపక్ష కూటమి నాయకత్వ బాధ్యతలను యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీకి అప్పగించవచ్చని విశ్వసనీయంగా తెలుస్తోంది. 

ఈరోజు జరగనున్న భేటీ అత్యంత కీలకమైనది. ఈనాటి సమావేశానికి కేవలం అగ్ర నాయకత్వాలు మాత్రమే హాజరుకానున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది క్లోజ్డ్ డోర్ మీటింగ్. సోనియాగాందీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రులు స్టాలిన్, నితీశ్ కుమార్, కేజ్రీవాల్, హేమంత్ సొరేన్, మమతా బెనర్జీ, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తదితరులు ఈనాటి భేటీలో పాల్గొంటారు. 

తమ ఫ్రంట్ పేరును కూడా ఈ సమావేశంలో విపక్ష నేతలు ఖరారు చేసే అవకాశం ఉంది. పేరులో 'ఇండియా' అనే పదం ఉండేలా నిర్ణయం తీసుకోబోతున్నారు. ఫ్రంట్ పేరుపై సూచనలు చేయాలని నిన్నటి విందు సమావేశంలో అన్ని పార్టీలను కోరినట్టు తెలుస్తోంది. కూటమి పేరుకు ట్యాగ్ లైన్ గా 'యునైటెడ్ వీ స్టాండ్' అని ఉంటుంది.

Opposition Meet
Sonia Gandhi
Front
Name
Bengaluru

More Telugu News